-
డాలర్తో పోలిస్తే 23 పైసలు లాభపడిన రూపాయి
-
రెండు వారాల్లో తొలిసారి 88 మార్క్ దిగువన ట్రేడింగ్
-
భారత్-అమెరికా వాణిజ్య చర్చల సానుకూల ప్రభావం
భారత రూపాయి, బుధవారం ట్రేడింగ్లో భారీ లాభాలను నమోదు చేసింది. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88 మార్కు కంటే దిగువకు చేరింది. రెండు వారాల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం కానున్నాయని వస్తున్న వార్తలతో మార్కెట్లో సానుకూల వాతావరణం నెలకొంది. దీనికి తోడు డాలర్ అంతర్జాతీయంగా బలహీనపడటం కూడా రూపాయి బలపడటానికి దోహదపడింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి 23 పైసలు బలపడి 87.82 వద్ద కొనసాగింది.
మంగళవారం నాటి ట్రేడింగ్లో రూపాయి 7 పైసలు లాభపడి 88.09 వద్ద ముగిసింది. అయితే, ఈరోజు అంతకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం అంచున ఉందని వార్తలు రావడంతో డాలర్పై ఒత్తిడి పెరిగింది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ప్రధాన ఆర్థికవేత్త మార్క్ జాండీ, అమెరికాలో ఉద్యోగాలు, ఉత్పాదకత, వ్యయాలకు సంబంధించిన డేటాను బట్టి చూస్తే దేశం మాంద్యం ముంగిట ఉందని విశ్లేషించారు.
అయితే, ఇన్వెస్టర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకోబోయే నిర్ణయం కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, రూపాయికి 88.20 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఒకవేళ 87.90 స్థాయిని దాటి మరింత బలపడితే, 87.50 లేదా 87.20 స్థాయులకు కూడా చేరే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ 0.11 శాతం పెరిగి 96.73 వద్ద ఉండగా, బ్రెంట్ ముడిచమురు ఫ్యూచర్స్ ట్రేడ్లో బ్యారెల్కు 68.33 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
Read also : Telangana : తెలంగాణలో ట్రాన్స్జెండర్లకు ఉపాధి: ట్రాఫిక్ విభాగం నుంచి మెట్రో రైల్ వరకు
